ప్రతాపరుద్రోదయం

చందుపట్ల యుద్ధంలో రుద్రాంబ మరణంతో కాకతీయ సిబిరంలో విషాదం కమ్ముకుంది. శత్రువుని త్రిప్పికొట్టామన్న విజయోత్సాహం ఒకవైపైతే మహారాజ్ఞి అస్తమించిందన్న నిజం మరోవైపు సైన్యాన్ని నీరుకార్చేస్తోంది. తమ దేవిని కాపాడుకోలేకపోయామని కాకతీయ సేనానులు కుమిలిపోతున్నారు. తన అమ్మమ్మ మరణవార్త కుమారునికి ఎలా చెప్పాలని మదనపడుతున్నారు.

ఇంతలో వేగులు డేగలతో ఓరుగంటికి సమాచారం పంపారు.

విజయలక్ష్మి సింహాసనమలంకరించింది

గజలక్ష్మి భూమిని ముద్దాడింది

ఈ గుప్త సందేశం విన్న కుమారుడికి విషయం అర్థమైనది. దుఃఖం తన్నుకొస్తున్నా నాయంకరుల మనోబలం దెబ్బతినకూడదని వారికి విద్యుక్త ధర్మం వివరించాడు. తానే ఎదురెళ్ళి సైన్యాన్ని కలిశాడు. యుద్ధభూమి దగ్గరే రుద్రమకు దౌహిత్రుడైన అధికారంతో దహన సంస్కారం చేశాడు.

రుద్రాంబ ధన్యచరిత. కారణజన్మురాలు. పరిపాలనా దక్షత కలిగిన క్రియాశీల చక్రవర్తిని. పురుషవేషం ధరించి ప్రతినిత్యం సభ తీర్చేది. సింహాసనారూఢియై విదేశీయులకు దర్శనమిచ్చేది. గూఢచార నివేదికలు ఆలకించేది. మంత్రులూ, సేనానులూ తదితర ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేది. ప్రజా సంక్షేమ చర్యలు చేపట్టమని వారికి బోధించేది. దేశ రక్షణార్ధం కదనరంగంలోకి దూకి శత్రువులపై భద్రకాళిలా విరుచుకుపడేది. ధైర్యసాహసాలు మూర్తీభవించిన దేవి ప్రజలను తన బిడ్డలుగా చూసుకునేది.

ఆ దేవి, ఇక లేదు !

శ్రీశైల పూర్వ ద్వారమైన త్రిపురాంతకం కాకతీయులకు పవిత్ర స్థలం. కాకతీయ చక్రవర్తులకు శివదీక్ష ఇప్పించి వారిని శివ పథం వైపు నడిపించిన గోళకీ మఠాచార్యుల స్థావరం. ఏ విజయమైనా, ఏ సంబరమైనా కాకతీయ చక్రవర్తులు త్రిపురాంతకంలోనే దేవతార్చనలు చేసి, దానాలు ఇచ్చి వేడుక జరుపుకునేవారు. అట్టి త్రిపురాంతకం ఇప్పుడు అంబదేవుడి వశమైనది. కాకతీయులని మూలాలతో సైతం పెకిలించివేస్తానని త్రిపురాంతకంలోనే చాటింపు వేయించాడు. స్వామికి ఘనంగా వేడుకలు చేసి కాకతీయుల ఊసైనా ఎత్తకుండా తానే సర్వస్వతంత్రుడిగా శాసనాలు చెక్కించాడు.

గణపతిదేవుని పాలనాకాలంలో కాకతీయ సామ్రాజ్యపు ఆగ్నేయ భాగాన్ని కాయస్థులు కాపు కాచేవారు. పానుగల్లు మొదలు కైవారం వరకు మార్జవాడి మొత్తం కాయస్థుల చేతిలో భద్రంగా ఉండేది. నెలూరుసీమ రాజకీయాలు కాకతీయుల గుప్పెట్లో ఉండేటట్లు సహాయకారిగా ఉండేవారు కాయస్థులు. కాంచి నుంచి పాండ్యులు పైకి చొరబడకుండా అడ్డుకట్ట వేసి ‘రాయస్థాపనాచార్య’ అన్న బిరుదుని పొందింది కాయస్థులే.

అట్టి కాయస్థులు అంబదేవుడి తిరుగుబాటుతో కాకతీయులకు బద్ధ శత్రువులైయ్యారు. తాను ఎన్ని యుద్ధాలలో విజయం సాధించినా కాకతీయ సైన్యంతో సరితూగనని అంబదేవుడికి తెలుసు. అందుకే వ్యూహం పన్ని కాకతీయ మాండలీకులు కొందరిని తన వైపుకు త్రిప్పుకున్నాడు. కాకతీయ సామ్రాజ్యపు వాయవ్య దిశని కాపు కాచే చెఱకు రెడ్లతో స్నేహం చేసి, చెఱకు బోలయపతి కుమారుడైన రాజరుద్రుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఆగ్నేయంలో నెల్లూరు విక్రమసింహపురి సింహాసనంపై మనుమ గండగోపాలుడిని కూర్చుండబెట్టి తనకు విధేయుడిగా చేసుకున్నాడు. కాకతీయ సామ్రాజ్యపు ఉత్తరాన ఉన్న అతి శక్తివంతమైన దేవగిరి యాదవుల సహాయం కోరాడు. దక్షిణాన పాండ్యుల ప్రీతిని సంపాదించుకున్నాడు.

చందుపట్ల యుద్థం తరువాత సుమారు ఏడాదిన్నర పాటు కుమార రుద్రదేవుడు అప్రమత్తంగానే ఉన్నాడు. కాకతీయ కాల్బలం, ఆశ్విక బలం, గజ బలం కాయస్థుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైనా, శత్రువుని తక్కువ అంచనా వేయకుండా జాగ్తత వహించాడు కుమారుడు. యువకుడేయైనా యుక్తిలో యుధిష్ఠిరుడంతటివాడు. అంబదేవుడి ప్రతి కదలిక పైనా దృష్టి పెట్టాడు. రుద్రమదేవి కాలం నుంచి ఉన్న నాయంకర వ్యవస్థను పటిష్టం చేశాడు. కోటలూ, దుర్గాలూ కట్టించి పంట చేలకు భద్రతా వలయాలు కల్పించాడు. అగ్రహారాలు దానమిచ్చి గ్రామస్థులలో ధర్మ నిరతిని పెంచాడు. సేవా మాన్యాలు, అర్థాయ వ్యవసాయాలూ ప్రోత్సహించి దేశాన్ని సుభిక్షం చేశాడు. వ్యాపార వాణిజ్యాలకు ఊతమిచ్చి దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగు చేశాడు. ఇల్లరి, పుల్లరి పన్నులతో పాటు తక్షక, అయస్కార, కుంభకార, స్వర్ణకార, రజక, నాపిత, చండాల వృత్తుల వారు సైతం తమ ఆదాయంలో ఆరింట ఒక వంతు కోశాగారానికి అర్పించి కాకతీయ మహాసేనను బలోపేతం చేశారు. దేవి వారికి చేసిన అమూల్యమైన మేలుకు ఇది చిన్నపాటి ప్రత్యుపకారం మాత్రమే. దేవి చావుకు దిగాలు పడకుండా దేశ ప్రజలందరూ క్రియాశీలంగా ‘పనిచేసి’ మరీ పగ తీర్చుకోవడానికి సహాయపడమని ప్రగతి పథం పట్టించాడు కుమార రుద్రదేవుడు. దేవికి పితృ యజ్ఞాలు జరుపుతూనే తనలో రగులుతున్న బడబానలాన్ని బయటకు పొక్కకుండా నిండుకుండలా నడుచుకున్నాడు కుమార రుద్రుడు.

త్రిపురాంతక పర్వతంపై ఖరనామ సంవత్సర నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు పవిత్రారోపణ పుణ్య కాలమున శ్రీ త్రిపురాంతక దేవర ప్రీత్యర్థం నవ రత్న మణి కనక భూషణ సహిత దేవమాన్య దానాలు చేస్తూ అంబదేవుడి శిష్యుడైన ఖదేవుడు పెద్ద ఎత్తున వేడుకలు జరిపించాడు. ఆ వేడుకలలో ఏనుగు అంబారీ ఎక్కి అంబదేవుడు నగర సంచారం చేస్తుండగా లెంకలు అతని జయకీర్తి గానాలు చేస్తున్నారు.

స్వస్తి సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర ఖండికోట మనోరథపురవరాధీశ్వర రాయసహస్రమల్ల ఏఱువ మల్లిదేవుని తలగొండుగండ చలమర్తిగండ సూర్యసోమ వంశరాయ నిర్మూలన మల్లికార్జున సప్తాంగ సంహరణ కాటవరాయ విధ్వంసన పాండ్యరాయ ప్రియప్రేషిత కరి తురగ రత్న దేవగిరిరాయ సంప్రేషిత మణి కనక భూషణ ప్రతిజ్ఞా పరశురామ రాయస్థాపనాచార్య మాండలీక బ్రహ్మరాక్షస గండపెండార శ్రీమతు అంబదేవ మహారాజుకు జయహో విజయహో !

బాహత్తర నియోగాధిపతి అనేక దేశాధిపతి చాతుర్వర్ణ సముద్ధరణ పశ్చిమరాయ దామోదర దిశాపట్ట ఏకాంగవీర వీరావతార అతి విషమహయారూఢ ప్రౌఢరేఖా రేవంత

విజయలక్ష్మీకాంత కాయస్థ కుల కమల మార్తాండ కదన ప్రచండ త్రిభువనాధీశ్వర శ్రీమతు అంబదేవ మహారాజుకు జయహో విజయహో !

గండికోట మనోరథపురం అంబదేవుని స్థావరం. నందిశైలంపై ఉద్భవించిన పెన్న ఉత్తర దిక్కుగా ప్రవహించి పాల్యం వద్ద తూర్పు తిరిగి చిత్రావతిని కలుపుకుని, రెండు వైపులా నిట్టనిలువైన గిరిముఖాల మధ్యనున్న నగోదరంలోకి ప్రవేశించి రెట్టింపు ధారతో గండికోటను నీలి త్రాచువలే చుట్టి తూర్పు సాగరంవైపు ప్రవహిస్తుంది. నది విశాలమైన శిలా పీఠికాన్ని రెండు ముక్కలుగా చీల్చి మధ్యలో పరవళ్లు త్రొక్కుతున్నట్లు గోచరిస్తుంది. ఆ పీఠభూమి దక్షిణ భాగంలో మనోరథపుర దుర్గం శత్రు దుర్భేద్యంగా విరాజమానమైయున్నది. పెన్న దాటినా పెనుకొండనెక్కలేక ఎంత పెద్ద సైన్యమైనా పుట్టమన్నులా నీటిలో కరిగిపోవలసిందే. అంబదేవుడిని ఓడించాలంటే గండికోటను ముట్టడించాల్సిందే.

అంబదేవుడు త్రిపురాంతకంలో వేడుకలు జరుపుకుంటుండగానే వేగులు ఒక వార్త మోసుకొచ్చారు. అప్పటి వరకూ ఉలుకు లేకుండా ఉన్న కాకతీయ మదగజం ఘీంకరించింది. అంబదేవుడు ఉలిక్కిపడ్డాడు.

శక్తివంతులతో స్నేహాలూ, వియ్యాలూ పెట్టుకున్న అంబదేవుణ్ణి దెబ్బకొట్టాలంటే అతని మిత్రుల పైనకూడా యుద్ధం చేయక తప్పదని గ్రహించిన కుమార రుద్రుడు ముప్పేట దాడికి వ్యూహం పన్నాడు. ముందుగా కాయస్థులకూ, పాండ్యులకూ వారధిగా ఉన్న నెల్లూరు విక్రమసింహపురి ప్రభువు మనుమ గండగోపాలునిపైకి దండు నడిపించాడు. రాయసకలసేనాధిపతి, ప్రతిపక్ష సమూహ హతోదాయ, ఖ్యాత రాజనీతి చాణక్య అని పేరుపొందిన సోమయాజుల రుద్రదేవయ్య నాయకత్వంలో సాగర తీరం మీదుగా కాకతీయ సైన్యం నెల్లూరు చేరుకుంది. పెన్నదాటి మనుమ గండగోపాలుని సైన్యంతో కలియబడింది. అనుకోని పరిణామం ఎదురవ్వడంతో గండగోపాలుడు కాంచి నుంచి పాండ్య సైనిక సహాయం పొందలేక పోయాడు. ఘోరమైన యుద్ధం జరుగుతుండగా సోమయాజుల రుద్రదేవుడు తన సైన్యంలో దక్షిణ భాగాన్ని అక్కడ విడిచి పశ్చిమ దిశగా నది వెంటే ప్రయాణించి పినాకిని-కుందు-పాపాగ్ని నదులు పెన్నలో కలుసుకునే త్రివేణి సంగమానికి చేరుకున్నాడు. అక్కడ నెల్లూరులో సోమయాజుల రుద్రదేవుని ‘దక్షిణ భుజదండ’ గా పేరు గాంచిన నాయకుడు వీరీధివీరుడు వజ్రాంగ కాయుడుయైన ఆడిదం మల్లు గండగోపాలుని తల నరికి రక్తసిక్తమైన చేతితో మీసం మెలేసి దేవి పార్థివ దేహంపై తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు.

ఈ వార్త విన్న అంబదేవుడి గుండెలో పిడుగు పడ్డట్టైనది. అటు నెల్లూరు చేజారిపోయింది. ఇటు రాజధానియైన మనోరథపురానికి ముప్పొచ్చింది. తక్షణం తన మిత్రులైన పాండ్య, యాదవ రాజులకు సహాయం కోసం వార్త పంపాడు. కానీ అప్పటికే కుమార రుద్రదేవుడు ఆ రెండు రాజ్యాలకీ అడ్డుకట్ట వేశాడు. కాంచిని దాటి పాండ్యులు రాలేరు. పెన్న నుంచి పాలారు వరకు ఆడిదం మల్లు స్వైర విహారం చేస్తుతున్నాడు. యాదవులు దాపుకు రాకుండా గోన విఠలుడి నాయకత్వంలో సైన్యాన్ని నడిపించి వారి నుంచి బళ్లారిలోని ఆదవోని, తుంబళం మరియు రాయచూరులోని మాణువ హాళువ కోటలను స్వాధీనం చేయించుకున్నాడు. గోన విఠలుడు వర్ధమానపురంలో స్థావరముండి పశ్చిమ దిక్కున కృష్ణ నుండి తుంగ వరకూ కాపు కాస్తున్నాడు. ఇక ఏ క్షణాన్నైనా త్రిపురాంతకం మీదకు దండు రావచ్చునని గ్రహించిన అంబదేవుడు అరణ్య మార్గం గుండా అతి తక్కువ పరివారంతో గండికోట మనోరథపురాన్ని చేరుకున్నాడు.

కాకతీయ సైన్యం కుమార రుద్రుడి పినతల్లి భర్తయైన ఇందులూరి అన్నయ్య మంత్రి నాయకత్వంలో త్రిపురాంతకం చేరుకుంది. అప్పటికే అంబదేవుడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. అక్కడ స్థావరమైయున్న ఖదేవుడి సైన్యం యుద్ధం చేయకుండానే అన్నయ మంత్రికి లొంగిపోయింది. తన సైన్యంలో కొంత భాగాన్ని త్రిపురాంతకంలో నిలిపి, అన్నయ మంత్రి దక్షిణ దిశగా ప్రయాణించి గండికోటకు ఉత్తరాన నదికి ఈవల వైపు నున్న మైలవరం చేరుకున్నాడు. వాయవ్యాన అన్నయ మంత్రి సైన్యం, ఆగ్నేయాన సోమయాజుల రుద్రదేవయ్య సైన్యం అంబదేవుణ్ని కదలనివ్వకుండా చేశాయి.

అయినప్పటికీ ఎత్తుమీదున్న మనోరథపురాన్ని చేరుకోవడం దుస్సాహసమే. అది కాక, అంబదేవుడి వద్ద పాండ్యులు ప్రసాదించిన ఆశ్విక, గజ దళాలు మెండుగా ఉన్నాయి. వాటిని ఎదురు వెళ్లి ఢీకొనడం అంత వివేకవంతం కాదు. ఇరుపక్షాల వారూ తొందరపడకుండా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. అంబదేవుడి పైన అన్ని వైపుల నుండీ దృష్టి పెట్టిన కాకతీయ నాయకులు ఒక బలహీనతను గమనించారు. మనోరథపురం ఎంతో ఎత్తైన పీఠ భూమిపైయున్నది. అక్కడ వాన నీటితో నిండిన చెలమలున్నా, వేల సంఖ్యలోనున్న అశ్వాలనూ, వందల సంఖ్యలో నున్న గజాలనూ నీరు త్రాగించడానికి కొండ దిగి పెన్నకు వాయవ్య దిశలోనున్న అగస్తేశ్వర కోన జలపాతం వద్దకు తీసుకు రావలసిందే. ఈ విషయం గమనించిన కాకతీయ సేనానులు ఓరుగంటికి సందేశం పంపించారు. వార్త అందుకున్న కుమారుడు నాలుగు లక్షల ధనుర్ధారులను ఓరుగంటికి కాపలా ఉంచి, అతి తక్కువ పరివారంతో అతి వేగంగా అగస్త్యకోనకు రహస్యంగా చేరుకున్నాడు.

కుమారుడు అగస్త్య కోనకు చేరుకున్నాడన్న వార్త తెలియగానే సోమయాజుల రుద్రదేవయ్య మొదటి పాచిక వేశాడు. కాయస్థ రాజ్య రెండవ రాజధానియైన వల్లూరు పట్టణాన్ని ముట్టడించాడు. కాకతీయ పదాతి దళాల ధాటికి తట్టుకోలేక కాయస్థ సైన్యం చెల్లా చెదురవసాగింది. అది చూసి, వల్లూరు కోటను కాపు కాస్తున్న చెఱకు రెడ్లు సోమయాజుల రుద్రదేవయ్యకు రాయబారం పంపారు. తమ వియ్యంకుడైన అంబదేవుడికి ప్రాణహాని కలిగించమని మాటిస్తే తాము యుద్ధం విరమించి లొంగిపోతామని ప్రతిపాదన చేశారు. రుద్రదేవయ్య ఆ ప్రతిపాదనను అంగీకరించి ఒకప్పుడు దేవి రుద్రాంబకు విధేయులుగా ఉండిన చెఱకు రెడ్లతో యుద్ధం విరమించాడు. ఆ విధంగా వల్లూరు కోట కాకతీయుల వశమైనది.

ఇంతలో ఉత్తరాన మైలవరంలో సైన్యంతో బసచేసిన ఇందులూరి అన్నయ్య మంత్రి నది దాటి గండికోట మీదకు సైన్యాన్ని నడిపించాడు. అది చూసిన అంబదేవుడు తానే సైన్యాధ్యక్షత వహించి అన్నయ్య మంత్రి సైన్యంతో తలబడ్డాడు.

అంబదేవుడు ఎన్నో యుద్ధాలలో విజయాలు సాధించిన వీరుడు. వయస్సు మీదపడుతున్నా ధృతరాష్ట్రుడంతటి బాహూబలం కలవాడు. చేతికి చిక్కిన శత్రు సైనికులని తన భల్లూకాలింగనంతో పిప్పి చేయగల బలశాలి. యుద్ధరంగంలో వ్యూహాలు పన్నడంలో నేర్పరి. తన సైన్యంతో పద్మ, సర్ప, గరుడ, త్రిశూల, ధూమకేతు, మేరు వ్యూహాలు పన్నించి కాకతీయ బలాలను అయోమయంలో పడేస్తున్నాడు. అంబదేవుడి ఖడ్గ ధాటికి కాకతీయ నాయకులు ఒక్కొక్కరే నేలకొరుగుతున్నారు.

ఇంతలో సూర్యాస్తమయమైనది. యుద్ధం ఆగింది. కాకతీయులు ఊహించినట్టుగానే కాయస్థ రౌతులు సూర్యోదయానికి ముందే అశ్వాలనూ గజాలనూ కొండచరియల గుండా క్రిందనున్న అగస్త్యకోన జలపాతంలో సేదతీరడానికి తీసుకువస్తున్నారన్న వార్త గూఢచారుల ద్వారా కుమారుడికి తెలిసింది. అప్పటికే అక్కడ పరివారంతో పొంచియున్న కుమారుడు అదే అదునుగా తలచి రౌతులను బంధించి కాయస్థ ఆశ్విక గజ దళాలను స్వాధీనం చేసుకున్నాడు. రౌతులు తీసుకు వెళ్లిన అశ్వాలూ గజాలూ ఎంత సేపటికీ తిరిగి రాక పోవడంతో మిగిలిన కాల్బలంతోనే అంబదేవుడు యుద్ధం కొనసాగించసాగాడు. కిరాత భైరవి వరప్రసాదుడైన అంబదేవుడు యుద్ధరంగంలో వీరభద్రుడిలా పోరాడుతున్నాడు. ఇంతలో కుమార రుద్ర దేవుడూ అతని పరివారమూ ఉడుముల సహాయంతో గండికోట గిరి ముఖాన్ని అధిరోహించి పశ్చిమ దిక్కు బురుజులని స్వాధీనం చేసుకున్నాడు. కోటపై గరుడ ధ్వజం ఎగురవేస్తున్న తమ యువరాజుని చూసి కాకతీయ శ్రేణుల్లో ఎనలేని ధైర్యం నిండుకుంది. రెట్టింపు ఉత్సాహంతో కాయస్థుల మీదకు విరుచుకుపడింది. వెనుక వైపు నున్న కోట గోడల మీద నుండి కాకతీయ ధనుర్ధారులు శర వర్షం కురిపించారు. దానికి కాయస్థ సైనం మిడతలు రాలినట్టు రాల సాగింది. అంబదేవుడు కుమార రుద్రుడు పసివాడుగా ఉన్నప్పుడు ఎత్తుకుని ఆడించిన వాడే.

‘ఎప్పుడూ ఎదో జపం చేస్తూంటావు కదా. ఆ మంత్రం నాకూ నేర్పు, తాతా’ అంటూ కాలికున్న గండపెడారాన్ని తనకివ్వమని అల్లరి చేశేవాడు కుమారుడు.

‘నువ్వు పెద్దవాడివైన తరువాత మంత్రమూ, పెండేరమూ రెండూ ఇస్తానులే మనవడా’ అని సర్ది చెప్పేవాడు అంబదేవుడు.

ఇప్పుడా పసి కూన బెబ్బులి వలే యుద్ధం చేస్తుంటే ఒక పక్క మమకారం మరో పక్క అహంకారం కలవర పెడుతున్నాయి. తాను పెంచిన చేప తిమింగలమై ప్రళయం సృష్టిస్తోంది.

ఇరు వైపుల నంచీ ముట్టడికి గురైన అంబదేవుడు, యుద్ధ రంగం నుండి మాయమైయ్యాడు. కనికట్టు విద్యలో ఆరితేరిన అంబదేవుడు కాకతీయుల కళ్లు కప్పి మారువేషంలో గండికోటకు దక్షిణాన ఉన్న కైవారానికి జారుకున్నాడు. అంతటితో కాయస్థ సైన్యం లొంగిపోయింది. యుద్ధం ముగిసింది. కానీ కుమారుడి కసి తీర లేదు. కుమారుడు ప్రళయకాల రుద్రుడి వలే కోపావేశంతో ఊగిపోతున్నాడు. స్వామి ద్రోహియైన అంబదేవుడికి బ్రతికియుండగానే నరకం చూపించి, బ్రతికియున్నంత వరకూ చావుని కోరుకునేలా చేయాలని ప్రతీకార జ్వాలలో రగిలిపోతున్నాడు. అలా అంబదేవుడిని తరుముకుంటూ కైవారం చేరుకున్నాడు.

————————————————————-

కైవార బెట్ట యతీశ్వరులు తిరగాడే ప్రదేశం. కుమారు రుద్రుడు సైన్యాన్ని క్రిందే నిలిపి,నలుగురు యోధులను వెంట పెట్టుకుని కైవార పర్వతం ఎక్కాడు. తన రాకు ముందే కొండపైనున్న కోట రిక్తకూపమైపోయింది. అక్కడ మానవ మాత్రుడు లేడు. గుఱ్ఱాలూ, ఏనుగులూ బంధ ముక్తులై తిరగాడుతున్నాయి. పర్వతంపై పచ్చని గడ్డిచేను చల్లటి గాలికి ఊగిసలాడుతోంది. ప్రశాంత వాతావర్ణం నెలకొన్నది. తాపాన్ని చల్లార్చి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. కుమారుడూ, అతని అనుచరులూ కోటంతా పరికించి ఎవరూ లేరని తెలుసుకుని కైవారం మీద నుంచి క్రిందనున్న చింతామణి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఎడ తెరిపి లేకుండా యుద్ధం చేసిన వారిని కైవార శిలలు ప్రణవ నాదాన్ని ప్రతిధ్వనింపజేస్తూ నర్మచిత్తుల్ని చేస్తున్నాయి.

ఇంతలో ఒక కదలిక, ఒక అలజడి. అప్రమత్తమైన కుమారుడు కత్తితో గుబురులను నరకగా అక్కడ యోగ వర్ఛస్సుతో వెలిగిపోతున్న ఒక యతీశ్వరుడు కనిపించాడు.

“మహానుభావా ! ఎవరు మీరు?” అని కుమారుడు ప్రశ్నించగా ఆ యతి సమాధానమివ్వక వద్దకు వచ్చి చెవిలో భైరవ మంత్రోపదేశం చేసి,

“నేటి నుండి నీవు కుమారుడవు కావు. నేటి నుండి నీవు ప్రతాపరుద్రుడవు. అఖండ త్రిలింగ సామ్రాజ్యపు ఏక ఛత్రాధిపతివి. నీకు శత్రు శేషం లేదు. అజేయుడవు” అని పలికి కళ్ళు తెరచేలోపు పది అడులు వేసి మంచు పొరలో మాయమయ్యాడు. క్షణ మాత్రంలో జరిగినట్లనిపించిన ఆ సన్నివేశాన్ని విశ్లేషించుకునే లోపు యతీశ్వరుడి ఛాయ కూడా కనుమరుగైనది. భైరవ మంత్రం మాత్రం చెవిలో నాదమై మ్రోగుతోంది.

ఇంతలో అనుచరులు యతి అడుగుజాడలు వెతుకుతూ కొంత దూరం వేళ్ళగా గడ్డిలో ఒక ఆభరణం దొరికింది. దాన్ని కుమారుని వద్దకు తీసుకొచ్చి చేతికివ్వగా అది చూసిన కుమారుడి కళ్ళు చమ్మగిల్లాయి. గొంతారిపోయి నోట మాట రాలేదు. మోకాళ్ళపై నిలబడి యతి నిల్చున్న భూమిపై ఆ ఆభరణాన్ని నిలిపి నుదుటితో తాకి, తనలో మిగిలియున్న పగని అక్కడే గురు దక్షిణగా సమర్పించి నిర్మల మనస్కుడై ప్రతాపరుద్రుడిగా ఉదయించాడు.

Societies are not static

Societies are not static. Communities are not committed to medieval conduct codes. Identities are not written in stone.

Our identities are malleable and are tempered by time and circumstance. To understand how an individual relates with different groups at different levels and takes on various partial identities all at once, one must sit with researchers in the field of social and political sciences.

I cherish one such chance meeting with Professor Harathi Vageeshan earlier this year. More to learn from you next time we meet sir.